ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు లిక్కర్ స్కామ్ విషయంలో తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ కేసులో విచారణలు, అరెస్ట్ల వ్యవహారం ఎప్పటికప్పుడు టెన్షన్ పెంచుతోంది.
ఈ కేసులో 12 మందిని అరెస్ట్ కాగా.. మరో 12 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 3వేల 200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను సైతం సిట్ అధికారులు అరెస్ట్లు చేశారు. నిందితులకు సంబంధించిన ఆస్తులు, భారీ అక్రమ సొమ్మును సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అరెస్ట్లు ఖాయం అంటున్నారు కూటమి నేతలు. మరో అడుగు ముందుకేసి.. లిక్కర్ కేసులో అగ్రనేత కూడా ఉన్నారని, ఆయనను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. రేపోమాపో ఆయన అరెస్ట్ కూడా ఉంటుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక హెచ్చరికలు చేశారు. కేబినెట్ సమావేశంలో మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ కేసులో అరెస్ట్ లపై ఎక్కువ మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా విచారణ ప్రక్రియ, అరెస్టులు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. లిక్కర్ కేసు సున్నితమైన అంశమని.. నేతలతోపాటు మంత్రులు కూడా అతిగా స్పందించవద్దని.. ఏదిబడితే అది మాట్లాడొద్దని.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆచితూచి మాత్రమే జవాబులు చెప్పాలంటూ ఆదేశించారు. ఈ కేసులో అరెస్టులు జరుగుతున్నా.. ఇంకా దర్యాప్తు పూర్తి కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం తరఫున ఎవరూ అనవసరంగా స్పందించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
0 Comments